Showing posts with label G.04.02 శ్రీగణపతి కథ శ్రీహనుమంతుని కథ నుండి పుట్టినదా?. Show all posts
Showing posts with label G.04.02 శ్రీగణపతి కథ శ్రీహనుమంతుని కథ నుండి పుట్టినదా?. Show all posts

Thursday, 3 September 2015

శ్రీగణపతి కథ శ్రీహనుమంతుని కథ నుండి పుట్టినదా?


1)    ప్రస్తుతం ప్రథమ పూజ అందుకుంటున్న శ్రీగణపతి ప్రస్తావన శ్రీమద్రామాయణంలో కనిపించదు.  ఆనాటికి ఇంద్రుడు, 33 మంది దేవతలు (8 మంది వసువులు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 2 అశ్వినిదేవతలు) మాత్రమే కొలువబడ్డారు.

2)     శ్రీరాముడు సీతాలక్ష్మణసహితంగా అరణ్యంలో తిరుగుతు, అగస్త్యమహర్షి ఆశ్రమం చేరుకుని, అక్కడ జరిగే నిత్య దేవతారాధనల గురించి ఈ విధంగా గమనించినట్లు శ్రీమద్రామాయణంలో వర్ణింపబడినది.

స తత్ర బ్రహ్మణ: స్థానం అగ్నే: స్థానం తథైవ చ ||
విష్ణో: స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వత: |
సోమ స్థానం భగ స్థానం స్థానం కౌబేరం ఏవ చ ||
ధాతుర్విధాతు: స్థానే చ వాయో: స్థానం తథైవ చ |
స్థానం చ పాశ హస్తస్య వారుణస్య మహాత్మన: ||
స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానం ఏవ చ |
స్థానం చ నాగరాజస్య గరుడ స్థానం ఏవ చ ||
కార్తికేయస్య చ స్థానం ధర్మ స్థానం చ పశ్యతి | (అరణ్యకాండ 12వ సర్గ 17-21 శ్లోకములు)

"ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, పాశహస్తుడైన వర్షదేవుడు, గాయత్రి, వసువులు,నాగేంద్రుడు, గరుడుడు, కార్తికేయుడు దేవతలకు అర్చించడానికి స్థానములు కలవు."

3)    శ్రీమద్రామాయణములో మత్స్య, వరాహ,నృసింహ మొదలైన విష్ణువవతారాల ప్రసక్తి కనిపించదు.

4)    వేదాలలో ఇంద్రుడు, నముచి అనే రాక్షసుడి మధ్యన జరిగిన యుద్ధం గురించి ఉంది.  నముచి ఇంద్రుడి కంటే బలవంతుడు.  అతనిని మంచి చేసుకోవడానికి, ఇంద్రుడు  నముచిని పగలుకానీ, రాత్రికానీ ఏ ఆయుధంతోగానీ చంపడానికి ప్రయత్నించనని వాగ్ధానం చేస్తాడు.  చివరకు నముచిని సంధ్యాసమయంలో, నీటి నురగను కొట్టి వధిస్తాడు.

5)    హిరణ్యకశిపుడు బ్రహ్మను కోరిన వరాలు ఇంచుమించు ఇలానే ఉంటాయి.  అతనిని కూడా విష్ణువవతారమైన నృసింహమూర్తి ఆ వరాలకనుగుణంగానే వధిస్తాడు.  బహుశ: హిరణ్యకశిపుని కథ, పైన చెప్పిన ఇంద్ర నముచిల కథనుండి పుట్టి ఉండవచ్చును.

6)    శ్రీమద్రామాయణములో శ్రీహనుమంతుడి కథ ఇలా ఉంది.  ఉదయిస్తున్న సూర్యుడిని పట్టుకుందామని శ్రీహనుమంతుడు 300 యోజనాలు, అంటే  3900  కిలోమీటర్లు (300 x 13 కిలోమీటర్లు)  దూరం చిన్న వయస్సులోనే ఎగిరాడు.

7)    ఎగిరివస్తున్న శ్రీహనుమంతుడిని చూసి ఇంద్రుడు తన వజ్రాయుధం ప్రయోగిస్తాడు.  దాని దెబ్బకు క్రింద పడిపోయిన  శ్రీహనుమంతుడిని అతని తండ్రి వాయువు రక్షించి, ఇంద్రుడిమీద కోపంతో ప్రపంచంలోని గాలిని స్తంభింపచేస్తాడు.  లోకం అల్లకల్లోలం కావడంతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు వరాలు ఇస్తారు.

8)     అత్యంత శక్తివంతమైన తన బ్రహ్మాస్త్రంతోసహా ఏ అస్త్రంవల్ల శ్రీహనుమంతుడికి హాని కలుగదని పితామహుడైన బ్రహ్మ వరమిస్తాడు.  ఇంద్రుడు అతని "స్వచ్చంద మరణం" అంటే తను కోరుకున్నప్పుడే మరణం కలిగేటట్లు వరమిస్తాడు.

9)     శ్రీగణపతి కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది.  శివుడి త్రిశూలం దెబ్బకు తల ఎగిరిపోయి, మరణించిన కుమారుని చూచి, అలుకవహించిన పార్వతిని బుజ్జగించడానికి, శివుడు, బ్రహ్మ దేవతలు వరాలు ఇస్తారు.

10)    బహుశ: శ్రీగణపతి కథ కూడా, శ్రీహనుమంతుని కథనుండి పుట్టి ఉండవచ్చును.