Showing posts with label G.10.3 ఇంద్రుడిమీద విష్ణు శివ ఆధిక్యం ఎప్పటినుండి ప్రారంభమయ్యింది? - భాగం-3. Show all posts
Showing posts with label G.10.3 ఇంద్రుడిమీద విష్ణు శివ ఆధిక్యం ఎప్పటినుండి ప్రారంభమయ్యింది? - భాగం-3. Show all posts

Thursday, 3 September 2015

ఇంద్రుడిమీద విష్ణు, శివ ఆధిక్యం ఎప్పటినుండి ప్రారంభమయ్యింది? - భాగం-3

I)     శ్రీమద్రామాయణం బాలకాండలోని కొన్ని ప్రక్షిప్తభాగాలలో, యుద్ధకాండలోని ప్రక్షిప్తభాగమయిన సీతాపరిత్యాగ ఘట్టంలో  ఉన్న శివ/శంకర ప్రస్తావన తప్ప, మిగిలిన ఐదు కాండలలో ఎక్కడ కూడా శివ/శంకర ప్రస్తావన కనిపించదు.  త్రిపురాంతకుడు రుద్రుడని శ్రీమద్రామాయణం చెబుతోంది.  

ఉదాహరణకు హనుమంతుడు లంకా దహనం చేసినపుడు, మహర్షి వాల్మీకి ఇలా కీర్తిస్తాడు.

హనూమతా వేగవతా వానరేణ మహాత్మనా|
లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా|

"మహాత్ముడు, మహాబలపరాక్రమములుగలవాడైన వానరోత్తముడగు హనుమంతునిచే ఆ లంకానగరము రుద్రునిచే త్రిపురములవలె దగ్ధమాయెను."

-------------------

త్రినేత్రుడు, త్రిశూలధారి, నందివాహనుడు, కైలాసవాసి, దేవాధీశుడుగా శివ/శంకర కీర్తన పురాణాలలో ప్రారంభమవుతుంది.


II)       శ్రీగణపతి, శ్రీ రాజరాజేశ్వరి  ప్రస్తావన క్రీ.పూ.3102లో కలియుగం ప్రారంభమయ్యేనాటికి లేకపోయినా తరువాత ప్రారంభమయినట్లు గ్రహించవచ్చును.   18 పురాణాలు వ్రాయించిన వారే,  మహర్షి వ్యాసుడు చెబుతుంటే, శ్రీగణపతి మహాభారతం వ్రాసినట్లు ఉండే మహాభారత అవతారికను చేర్చి ఉండవచ్చును.

III)        వైష్ణవం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.  వారు అప్పటికే ప్రాధాన్యం సంతరించుకున్న మహాపురుషులందరిని విష్ణువవతారాలుగా మార్చి పురాణాలు వ్రాయించేసారు.

క్రీ.పూ.509 నాటికి శ్రీ ఆది శంకరులు మన దేశమంతా పర్యటించి, బౌద్ధమతాన్ని తరిమివేసి,  అప్పటికి ప్రాబల్యంలో ఉన్న 6 మతాలను (వైష్ణవ, శైవ, శాక్తేయ, గాణపత్య, సూర్య, కార్తికేయ) స్థిరీకరించినట్లు మనం చదువుతుంటాము.  

ఐతే అప్పటికే ప్రధాన మతాలవారు వేదాలలో, ఉపనిషత్తులలో, శ్రీమద్రామాయణం, మహాభారతం మొదలైనవాటిలో ప్రస్తావించబడిన కథలలో ఉన్న ప్రముఖపాత్రలను తమకు ఇష్టమైన దేవత/దేవుడి అవతారంగా/పిల్లలుగా/వాహనాలుగా కథలను (పురాణాల ద్వారా) సృష్టించి ప్రచారం చేయడం జరిగింది.  

   ఉదాహరణకు 

(1) పితామహుడు బ్రహ్మ లోక క్షేమం కోసం తీసుకున్న మత్స్య, వరాహ రూపాలను విష్ణువుకు ఆపాదించడం, మహాపురుషులైన శ్రీరామ, శ్రీకృష్ణులను, మహర్షి వ్యాసుని  విష్ణువవతారాలుగా  మార్చడం.  శ్రీమద్రామాయణం నాటికే విష్ణువుతోపాటు పూజలందుకున్న  గరుత్మంతుని విష్ణువుకు వాహనంగా మార్చిన కథ ఈ కోవలోనిదే.

(2) శ్రీమద్రామాయణం నాటికి శివుని ప్రస్తావన లేకపోయినా శ్రీహనుమంతుని శివుని అవతారంగా చిత్రించే  ప్రయత్నం, ఋషీశ్వరుడైన నందీశ్వరుని శివుని వాహనంగా మార్చిన కథ, శ్రీమద్రామాయణం నాటికే విష్ణువుతోపాటు పూజలందుకున్న కార్తికేయుని శివుని కుమారునిగా చెప్పిన కథ ఈ కోవలోనివే.

(3) శ్రీమద్రామాయణం, మహాభారతం మొదలైనవాటిలో ప్రస్తావించబడిన కథలలో కార్తికేయుని ప్రస్తావన తప్ప ఎక్కడకూడా గణపతి ప్రస్తావన లేకపోయినా, పురాణాల ద్వారా పార్వతి కుమారుడుగా, కార్తికేయుని అన్నగా చిత్రించే ప్రయత్నం ఈ కోవలోనిదే.

(4) శ్రీమద్రామాయణంలో గాయత్రి ప్రస్తావన తప్ప, మరియే శక్తి రూపం ప్రస్తావన కనిపించదు.  శాక్తేయ సాంప్రదాయంలో ఉన్న కథలన్నింటికి మూలం పురాణాలే.  శ్రీమద్భగవద్గీతలో  శ్రీగణపతి, శ్రీ రాజరాజేశ్వరి ప్రస్తావన కనిపించదు.