Thursday, 3 September 2015

శ్రీ హనుమ - గొప్ప గూఢాచారి

1)   శ్రీ హనుమ, లంకాధిదేవతైన లంకినిని జయించి లంకలోకి కనబడి, కనబడని ఒక పిల్లి ఆకారప్రమాణంలో  ప్రవేశిస్తాడు.

సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి: |
వృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుతదర్శన:||  (సుందరకాండ 2వ సర్గ 49వ శ్లోకము)

"సూర్యుడస్తమింపగనే మారుతి రాత్రియందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను."

---------------
(చడీ చప్పుడు లేకుండా, ఎవ్వరి దృష్టిలో పడకుండా సంచరించుట పిల్లి స్వభావము.  ఇది శ్రీహనుమ 'సూక్ష్మబుద్ధికి ' నిదర్శనము.  -  శ్రీ గీతా ప్రెస్, గోరఖ్‌పూర్)
---------------

2)   32 కోట్లమంది రాక్షసులు, వారి కుటుంబాలు ఉన్న లంకానగరమంతా సీత కోసం, రాక్షసుల గృహాలు,  గుప్త గృహాలు,విహారస్థలాలు మొదలైనవన్నీ ఒకసారి, రావణుని అంత:పురాన్ని2 మార్లు, రాత్రి ప్రారంభకాలం నుంచి తెల్లవారుఝామున సీతను అశోకవనంలో చూసేలోపున (కొన్ని గంటలలో)  పట్టి, పట్టి చూసాడంటే, ఎంత వేగం, ఎంత శక్తి, ఎంత సహనం ఉండి ఉండాలి?

3)   మిగిలిన ప్రాంతాలలోనైతే అందరు నిద్రపోతుండడంవల్లనో, మధిర మత్తులోనో ఉండి శ్రీహనుమను ఎవరు గమనించలేదంటే అర్థం చేసుకోవచ్చును.  ఐతే రావణుని అంత:పురంలో రావణునికి సక్రమంగా గాలివీచడం కోసం పరిచారికలు వింజామరతో వీస్తున్నట్లు వాల్మీకి వర్ణిస్తాడు.

వాల వ్యజన హస్తాభి: వీజ్యమానం సమంతత: |
గంధై: చ వివిధైర్జుష్టం వర ధూపేన ధూపితం || (సుందరకాండ 10వ సర్గ 6వ శ్లోకము)

"అచట చామరములను చేతబట్టి అంతటను వాయు ప్రసారము జరుగునట్లు స్త్రీలు వీచుచుండిరి. అది వివిధ సుగంధభరితమైయుండెను."

శ్రీహనుమ గాలి ప్రసరించేటట్లు చేస్తున్న రాక్షస స్త్రీలు అక్కడ ఉండగానే, నిద్రలో ఉన్న రావణుని భార్యలనందరిని, వారి ఆభరణాలను, వారు ధరించిన పూలమాలలను, నిద్రలోని వారి చేష్టలను, ఎటువంటి వికారము చెందకనే పరిశీలించినట్లు వాల్మీకి వర్ణిస్తాడు.

4)     తను వచ్చిన ప్రధానకార్యం సీతను వెతకడం.  జటాయువు అన్నైన సంపాతి చెప్పినట్లు, సీత లంకలో ఉందో లేదో తెలుసుకునేవరకు తన ఉనికిని ఎవరికీ తెలియకుండా, ఉండిపోతాడు.  సీతతో మాట్లాడి, ఆమెను ఓదార్చిన తరువాత, సీతకు స్వాతన కలగడానికి, అంతవరకు లంకలో ఎవ్వరు భయపెట్టలేని రాక్షసులను భయపెట్టి, మనోస్థైర్యం పోగొట్టడానికి యుద్ధానికి దిగుతాడు.

కొండంత తన శరీరాన్ని సీతకు చూపించి, తను ఏమి చేయగలడో సీతకు చెబుతూ, ఇలా అంటాడు.

సపర్వత వన ఉద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం |
లంకాం ఇమాం సనథాం వా నయితుం షక్తి: అస్తి మే || (సుందరకాండ 37వ సర్గ 37వ శ్లోకము)

"పర్వతములతో వనప్రదేశములతో ఒప్పుచున్నదియు, కోటబురుజులతో, ప్రాకారములతో, ముఖద్వారములతో విలసిల్లుచున్నదియు అగు ఈ లంకా నగరమును రావణ సహితముగా తీసికొనిపోగలశక్తి నాకుగలదు."


5)   దాదాపు 8 కోట్లమంది రాక్షసులను ఒక్కడే సంహరించి, రావణునితో మాట్లాదలచి, తనంతతానుగా ఇంద్రజిత్తుకు పట్టుబడి రావణునికి ఎదురుబడినపుడు కూడా, రావణుని వంశ ప్రతిష్టను, అతని గొప్పతపస్సును గుర్తుచేస్తూ, సీతను అపహరించి తీసుకుని రావడమనే అనుచితకార్యం గురించి ప్రస్తావించి, మందలిస్తాడు.  చేసిన తప్పును సరిచేసుకోమని హెచ్చరిస్తాడు.

అదే శ్రీహనుమ గొప్పతనం

No comments:

Post a Comment