Thursday, 3 September 2015

దేవతలను ఆశ్రయించినవారు ఏమవుతారు?

 శ్రీమద్భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు తాను విష్ణువవతారంగా చెప్పలేదు. అర్జునుడు విశ్వరూపసందర్శనం తరువాత, తాను విశ్వరూపం చూడలేకపోతున్నానని, శ్రీకృష్ణుని "కిరీటము, చక్రము, గద" ధరించిన రూపంలో దర్శనమిమ్మని అడగడం, తరువాత కాలంలో చేర్చిన ప్రక్షిప్తభాగమయి ఉండాలి.

అర్జునునికి శ్రీమద్భగవద్గీతను బోధించిన సమయంలో శ్రీకృష్ణుడు అద్వైతస్థితిలో ఉన్నాడు.  ఉత్కృష్టమైన యోగస్థితిలో ఉన్న శ్రీకృష్ణునికి, మనస్సు, కోరికలు ఏమి లేవు. శరీరం ఉన్నా పరబ్రహ్మలో మనస్సు లీనమై ఉంది. ఆటువంటప్పుడు తాను ఒక దేవుని అవతారమని, తన చుట్టు ప్రజలను పోగుచేసుకుని, ఆ గుంపుకు ఆధిపత్యం వహించే కోరికే లేదు.  స్వామికి ఆ దు:స్థితి పట్టదు. 

పరబ్రహ్మలో మనస్సు లీనమై ఉంది కనుకే, శ్రీకృష్ణుడు దేవతలను ఆశ్రయించి పూజలు చేస్తూ జీవితం గడిపేవారు మరణానంతరం ఏమవుతారు, పరబ్రహ్మలో మనస్సు లీనమై  ఉన్న గురువును ఆశ్రయిస్తే ఏమవుతారు అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు.  ఇక్కడ దేవతలంటే కేవలం ఇంద్రుడు, అగ్ని మొదలైనవారు మాత్రమే అనుకుంటే పొరపాటు.  విష్ణువు, శక్తి, శివుడు మొదలైనవారు కూడా వస్తారు.

------------------------------------

త్రైవిద్యా మాం సోమపా: పూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
 తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ || (శ్రీమద్భగవద్గీత, రాజవిద్యా రాజగుహ్య యోగము  20వ శ్లోకము)

"ఋగ్యజుస్సామవేదములచే (ఈ 3 వేదభాగములను "వేదత్రయీ" లేక "త్రివిద్యా" అని అందురు) ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరసపానముచేయువారును, పాపరహితులై యజ్ఞములద్వారా నన్ను సేవించి, స్వర్గప్రాప్తిని కోరుచుందురు.  అట్టి పురుషులు తమ పుణ్యఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు.  అచ్చట దేవతల దివ్యభోహములను అనుభవింతురు."


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి|
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే||  (శ్రీమద్భగవద్గీత, రాజవిద్యా రాజగుహ్య యోగము  21వ శ్లోకము)


"ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగనే) మఱల మర్త్యలోకమున ప్రవేశింతురు.  ఈ విధముగ స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు.  అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు.  పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు."


యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతా:|
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోऽపి మాం||

(శ్రీమద్భగవద్గీత, రాజవిద్యా రాజగుహ్య యోగము  25వ శ్లోకము)

"దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు.  పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు.  భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు.  నన్ను ఆరాధించు భక్తులు నన్నే పోందుదురు.  అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు."

-------------------------------------

దేవతలంటే కేవలం ఇంద్రుడు, అగ్ని మొదలైనవారు మాత్రమే కాకుండా విష్ణువు, శక్తి, శివుడు మొదలైనవారు కూడా వస్తారు అనడానికి ఒక ఉదాహరణగా మహారాష్ట్రలో జీవించిన శ్రీకృష్ణుని భక్తుడైన నామదేవుని  జీవితాన్నే తీసుకోవచ్చును.

శ్రీకృష్ణుని భక్తుడైన నామదేవుడు శ్రీకృష్ణునితో మాట్లాడేవాడు, ఆడేవాడు, భోజనం పెట్టేవాడు.  అటువంటి భక్తుడు కూడా,  పరబ్రహ్మలో మనస్సు లీనమైఉన్న గురువును ఆశ్రయించిన తరువాత, శ్రీకృష్ణుని గుడికి వెళ్ళడం మాని, ఇంట్లోనే పరబ్రహ్మలో లీనమై ఉండేవాడు.

No comments:

Post a Comment