Monday, 14 September 2015

బాలకాండ పాక్షికంగా ప్రక్షిప్తమా? (భాగం - 2),



వాల్మీకి మహర్షి శైలి గురించి మాట్లాడుకుంటే  (i) ఆయన ప్రకృతిని వర్ణించే విధానము,   (ii)  సన్నివేశాలలో ఆయన ఉపయోగించిన సుందరమైన, సున్నితమైన పోలికలు,   (iii) శ్రీమద్రామాయణంలో ఆయన వాడిన చందస్సులు వంటివాటికన్నా,   (iv) కథ సాగుతున్నప్పుడు వివరించవలసినపుడు సందర్భాన్ననుసరించి ఎంతవరకు ఉప కథలు చెప్పాలో అంతవరకే చెప్పడం, అనే విషయాన్నే ఇక్కడ ప్రామాణిక వస్తువుగా తీసుకున్నాను.   ఎందుకంటే అదే ఇక్కడ అవుసరమయినది.

---------------------

ఇక బాలకాండలోని ప్రక్షిప్తాల విషయానికొస్తే, అవి 3 రకాలుగా ఉన్నాయని నాకనిపించింది.

I) అవతారిక

II) వాల్మీకి మహర్షి శైలి: కథకు సంబంధం లేకపోయినా  ఉప కథలు చొప్పించడం

III)  వాల్మీకి మహర్షి కీర్తించిన  వేదకాలపు దేవతారాధన పద్ధతులతో సంబంధంలేని విధంగా ఇతర దేవతలను కీర్తిస్తూ ఉన్న ఘట్టాలు.

--------------------

I)     అవతారిక ఒక ప్రక్షిప్తమే!

అవతారిక బాలకాండలోని మొదటి 4 సర్గలలో ఉంది.  ఇందులో (i) దేవర్షైన నారదుడు వాల్మీకి మహర్షి వద్దకు రావడం, ఆయనకు శ్రీరాముని కథ చెప్పడం, (ii)  స్నానానికి వాల్మీకి మహర్షి నదికి వెళ్ళినపుడు, వేటగాడి దెబ్బకు బలైన క్రౌంచపక్షిని చూసినపుడు, ఆయన నోటివెంట ఆశువుగా కవిత్వం రావడం, (iii) పితామహుడైన బ్రహ్మ వచ్చి, శ్రీమద్రామాయణం రచించమని చెప్పడం, (iv) మహావిష్ణువు అవతారంగా వచ్చిన శ్రీరాముని కథను వాల్మీకి మహర్షి  వ్రాయడం, (v) లవకుశులు శ్రీమద్రామాయణాన్ని గానం చేయడం, ఇవి అవతారికలో మనకు కనిపించే విషయాలు.

ఇక్కడ గమనించవలసినవి 3 విషయాలు.

i) నారదుడు శ్రీరాముని గురించి  వాల్మీకికి చెప్పడం

శ్రీమద్రామాయణం  వేదకాలంలో వచ్చిన కావ్యం.  వాల్మీకి మహర్షి ఈ కావ్యాన్ని వేదసాంప్రదాయాలను అనుసరించి వ్రాసారు. అందుకే ఈ కావ్యంలో ఆయన చేసిన దేవతాస్తుతులు వేదకాలంనాటి దేవతల స్తుతిలాగే ఉంటుంది.  అందులో బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, మరుత్తగణాలు, మొదలైన దేవతల స్తుతులు ఉంటాయి.

విష్ణువు స్తుతి ఉన్నా అది ఇంద్రుడి తమ్ముడిగా, దేవతలలో ఒకడిగా మాత్రమే ఉంటుంది.  ఈ కాలంలో మనకు తెలిసిన విష్ణువులాగా అంటే దేవాధిదేవుడిగా మాత్రం ఉండడు.

శివుడి ప్రస్తావన కనిపించదు, కానీ రుద్రుడు కనిపిస్తాడు.  ఐతే ఈ రుద్రుడు ఇపుడు మనకు తెలిసిన శివునిలా అంటే త్రినేత్రుడిగ, త్రిశూలధారిగా, తలపై గంగతో, దేవాధిదేవుడిగా మాత్రం ఉండడు.  దేవతలలో ఒకడు. అంతే!

వేద సాహిత్యంలో ఎక్కడకూడా నారదుడు కనిపించడు.  శ్రీమద్రామాయణం బాలకాండలోని అవతారికలో తప్ప, ఇతర కాండలలో ఎక్కడకూడా నారదుడు కనిపించడు. మరి నారదుడు ఇక్కడ మాత్రమే ఎలా కనిపించినట్లు?


ఈ భాగం ప్రక్షిప్తమే అయి ఉండాలి.


ii)   పితామహుడైన బ్రహ్మయే స్వయంగా వచ్చి, శ్రీమద్రామాయణం రచించమని చెప్పడం.


 ఇది చిత్రమైన విషయం. లోకకళ్యాణం కోసం శ్రీమద్రామాయణం రచించమని చెప్పినా చిత్రమే!  ఎందుకంటే ఈ విధంగా వేదాలలోని సత్యాలను దర్శించిన మిగిలిన ఋషులను, లోకకళ్యాణం కోసం ఆ సత్యాలను లోకానికి తెలియజేయమని, బ్రహ్మయే స్వయంగా వచ్చి ఆదేశించినట్లు ఎక్కడా లేదు.  వేదాలు కూడ లోకకళ్యాణం కోసమే కదా!

మరి ఈ విషయంలోనే ఎందుకు పితామహుడైన బ్రహ్మయే స్వయంగా వచ్చినట్లు?  ఈ భాగం ప్రక్షిప్తమే అయి ఉండాలి.


iii)   లవకుశులు శ్రీమద్రామాయణం గానం చేయడం


అవతారికలో కనిపించే లవకుశులు, మళ్ళీ ప్రక్షిప్తకాండైన "ఉత్తరకాండ"లో కనిపిస్తారు.  శ్రీమద్రామాయణం యుద్ధకాండలో శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది.  అవతారికలో కనిపించే లవకుశులు ప్రక్షిప్తకాండైన "ఉత్తరకాండ"లో కనిపించారు అంటే "అవతారిక" ఉన్న 1వ సర్గ నుంచి 4వ సర్గవరకు ప్రక్షిప్తమే అయి ఉండాలి.

No comments:

Post a Comment