Thursday, 3 September 2015

వేదములు ఎన్ని?


ఈ ప్రశ్నను చదవగానే/వినగానే, వేదవిభజన చేసిన వేదవ్యాసుని గురించి, పంచమవేదమని పిలువబడే మహాభారతము గురించి వినిన/చదివినవారికి, అడిగినవాడి అజ్ఞానానికి నవ్వు రావచ్చును.

ఎందుకంటే ప్రచారంలో ఉన్న కథల ప్రకారము ఒకే రాశిగా ఉన్న వేదాన్ని, విష్ణువు అవతారమైన వ్యాసుడు విభజించాడని, అప్పటికే ఉన్న ఋక్సామ యజు అధర్వణవేదాల సారమంతా మహాభారతములో ఉండడంవల్ల,  మహాభారతము పంచమవేదమని పిలువబడినదని వింటుంటాము.

ఐతే ఈ ప్రశ్న కొంచెము ఆలోచించే వేసినదే అని నా మనవి.

వేదకాలానికి చివరిలో వచ్చినది శ్రీమద్రామాయణము.  ఆ తరువాత చాలా కాలానికి మహాభారతము వ్రాయబడినది.  కాబట్టి ప్రచారంలో ఉన్న కథల ప్రకారము శ్రీమద్రామాయణము నాటికి వేదము ఒకే రాశిగా ఉండిఉండాలి.


-----------
ఐతే శ్రీమద్రామాయణమునాటికే వేదము 3 భాగములుగా ఉండేదని  క్రింది శ్లోకములనుబట్టి  తెలుస్తుంది.


(1)   శ్రీమద్రామాయణములో, కిష్కిందకాండలో శ్రీహనుమ మాటలాడే విధానాన్ని గమనించిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అంటాడు.

నాऽనృగ్వేద వినీతస్య నాऽయజుర్వేదధారిణ:|
నాऽసామవేదవిదుష: శక్యమేవం ప్రభాషితుం|| (కిష్కిందకాండ 29వ శ్లోకము)

"ఋగ్వేదమునందును, యజుర్వేదమునందును, సామవేదమునందును సుశిక్షితుడైనవాడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్థుడు."


(2)  శ్రీరాముని రూపురేఖలను, గుణాలను వర్ణించమని సీత కోరగా, శ్రీహనుమ శ్రీరాముని రూపురేఖలను, గుణాలను గురించి చెబుతు ఇలా అంటాడు.

యజుర్వేదవినీతశ్చ వేదవిద్భిస్సుపూజిత:|
ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత:|| (సుందరకాండ 35వ సర్గ 14వ శ్లోకము)

"శ్రీరాముడు యజుర్వేదమునందు సుశిక్షితుడు. వేదములయందు నిష్ణాతులైన పండితులచే పూజింపబడుచుండెడివాడు.  ధనుర్వేదమునందు, ఇతర వేద వేదాంగములయందు నిష్ణాతుడు."

----------------------------------------

మహాభారతముకాలంలో వచ్చిన వేదవ్యాసుడు వేదవిభజన చేసినట్లు మనం చదువుతున్నాము.  పంచమవేదమని పిలువబడిన మహాభారతమునాటి పరిస్థితి గమనిస్తే ఆశ్చర్యమే కలిగింది.  మహాభారతములో భాగమైన శ్రీమద్భగవద్గీతలోని క్రింది శ్లోకములను గమనించగలరు.
(1)   పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ:|
      వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ|| 

(శ్రీమద్భగవద్గీత, రాజవిద్యా రాజగుహ్య యోగము  17వ శ్లోకము)

"ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే.  తల్లియును, తండ్రియును, తాతయును నేనే.  తెలిసికొనదగిన వాడనూ నేనే.  పవిత్రుడను, ఓంకారమును నేనే.  ఋక్సామయజుర్వేదములును నేనే."


(2)    త్రైవిద్యా మాం సోమపా: పూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
       తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ||

(శ్రీమద్భగవద్గీత, రాజవిద్యా రాజగుహ్య యోగము  20వ శ్లోకము)

"ఋగ్యజుస్సామవేదములచే (ఈ 3 వేదభాగములను "వేదత్రయీ" లేక "త్రివిద్యా" అని అందురు) ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరసపానముచేయువారును, పాపరహితులై యజ్ఞములద్వారా నన్ను సేవించి, స్వర్గప్రాప్తిని కోరుచుందురు.  అట్టి పురుషులు తమ పుణ్యఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు.  అచ్చట దేవతల దివ్యభోహములను అనుభవింతురు."

అంటే కలియుగ ప్రారంభానికి రమారమి 36 సంవత్సరాలకు ముందు జరిగిన మాహాభారతయుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన  శ్రీమద్భగవద్గీతనాటికి కూడా వేదాలు మూడే భాగాలుగా ఉన్నాయి.

మరి 4వ వేదంగా చెప్పబడే అథర్వణవేదం ఎప్పటిది?

అంటే ప్రచారంలో ఉన్న కథల ప్రకారము ఒకే రాశిగా ఉన్న వేదాన్ని, విష్ణువు అవతారమైన వ్యాసుడు విభజించాడని, అప్పటికే ఉన్న ఋక్సామ యజు అధర్వణవేదాల సారమంతా మహాభారతములో ఉండడంవల్ల,  మహాభారతము పంచమవేదమని పిలువబడినదని ఉన్న కథలన్నీ తరువాత చేర్చబడినవని అర్థమవుతుంది.

విష్ణువు స్థానాన్ని పెంచడానికి, తద్వారా దేవతలలో శ్రేష్టుడిగా చేసిన ప్రక్రియలో భాగమే ఇదంతా!  శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని ఎలాగైతే విష్ణువవతారాలుగా మార్చి ప్రచారం చేసారో, అదేవిధంగా మహర్షి వ్యాసుని విష్ణువవతారంగా మార్చి ప్రచారం చేసారు.

No comments:

Post a Comment