Friday, 4 September 2015

విభూతియోగములో శ్రీకృష్ణుడు ప్రస్తావించిన రాముడెవరు?

విభూతియోగములో శ్రీకృష్ణుడు  రాముని గురించి ప్రస్తావిస్తాడు.

పవన: పవతామస్మి రామ: శస్త్రభృతామహం|
ఝషాణాం మకరశ్వాస్మి స్రోతసామస్మి జాహ్నవీ||   (శ్రీమద్భగవద్గీత, విభూతి యోగము  31వ శ్లోకము)

"పవిత్రమొనర్చు వారిలో వాయువును నేను.  శస్త్రధారులలో రాముడిని నేను. మత్స్యములలో మొసలిని నేను.   నదులలో గంగానదిని నేను."

ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రస్తావించిన రాముడెవరు?  

ధశరథుని కుమారుడైన రాముడా?  పురాణాలలో జమదగ్ని కుమారుడిగా కీర్తించబడిన పరశురాముడా?  ఇద్దరు కూడా  శస్త్రధారులలో గొప్పవారే!

అన్ని వర్గాలలో/తెగలలో ఉన్న అధికుని నేనే అని  శ్రీకృష్ణుడు  అన్నాడనే విషయం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొఱుకుతుంది.

1)        ధశరథుని కుమారుడైన రాముడు ఎవరి చేతిలోను అపజయం పొందలేదు.  ఈ అజేయత్వాన్ని ప్రకటించే లక్ష్మణుడు అస్త్ర ప్రయోగం చేసి, ఇంద్రజిత్తుని వధించాడు.

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది || 
పౌరుషే చాऽప్రతిద్వంద్వ: శరైనం  జహి రావణిం |    (సుందరకాండ 90వ సర్గ 71వ శ్లోకము)

"ఓ బాణమా! దశరథ మహారాజు కుమారుడు, ధర్మనిరతుడు, సత్యసంధుడు ఐన శ్రీరాముడు నిజముగా పరాక్రమమున సాటిలేనివాడే యైనచో ఈ ఇంద్రజిత్తును హతమార్చుము"

2)         పరశురాముడు  శస్త్రధారులలో గొప్పవాడేయైనా, ఆయన భీష్ముని చేతిలో ఓడిపోయాడు అని మహాభారతం చెబుతోంది..  కాబట్టి ఆయన శస్త్రధారులలో శ్రేష్టుడనలేము.

విభూతియోగములో శ్రీకృష్ణుడు ప్రస్తావించినది ధశరథుని కుమారుడైన శ్రీరాముడే!

No comments:

Post a Comment