Thursday, 3 September 2015

సీతాపరిత్యాగ ఘట్టము ఒక ప్రక్షిప్తమే!


శ్రీరామ రావణ యుద్ధంలో  రావణుడు మరణించిన తరువాత, సీతను తీసుకునిరమ్మని విభీషణునికి శ్రీరాముడు చెబుతాడు.  సీత వచ్చిన తరువాత, రావణుని చెరలో ఉన్న ఆమె శీలాన్ని అనుమానిస్తూ, ఆమెను పరిత్యజిస్తున్నట్లు శ్రీరాముడు చెప్పినట్లు, తరువాత సీత అగ్ని ప్రవేశం చేసినట్లు, దేవతలందరు వచ్చినట్లు, వారి ఆదేశంతో శ్రీరాముడు తిరిగి సీతను స్వీకరించినట్లు,  శ్రీమద్రామాయణంలోని యుద్ధకాండలో 115-118 సర్గలలో ఉంది.

అప్పటివరకు సీతను చూడడానికి తహతహలాడిన శ్రీరాముడు, ఆమె ఒక నెలరోజులు మాత్రమే జీవిస్తానని శ్రీహనుమంతునితో పంపిన సందేశం విని, అదేరోజు యుద్ధానికి బయలుదేరిన శ్రీరాముడు, నిజంగానే ఆమె మీద శంక కలుగుతే, అప్పుడే ఆలస్యంచేయవచ్చునే?  నెలరోజుల తరువాత బయలుదేరితే సీత ప్రాణత్యాగంచేసుండేది కద!

సముద్రుడు దారి ఇవ్వటంలేదని సముద్రుడిమీద బ్రహ్మాస్త్రమే ప్రయోగింపబూనాడు కద?   అప్పుడైనా, వారథి కట్టలేకపోయానని అయోధ్యకు తిరిగి వెళ్ళీపోవచ్చును కదా? కానీ శ్రీరాముడు అలా చేయలేదే?

దేవతలు చెబితేగానీ సీత ఎటువంటిదో శ్రీరాముడికి తెలియదా?    శ్రీరాముడి వంటి మూర్తీభవించిన ధర్మమూర్తికి సీతను అలా శంకించడం అధర్మమని తెలియదా?   అంటే విషయం అదికాదు.

శ్రీరాముడు విష్ణువవతారం అని నిరూపించే ప్రయత్నంతో, ఒక పద్ధతి ప్రకారం శ్రీమద్రామాయణంలో ప్రక్షిప్తం చేయబడ్డ  (తరువాతి కాలంలో చేర్చబడినవి) కథలివి.   యుద్ధకాండలోని 115 నుండి 118 సర్గలను  జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

------------

115-118 సర్గలలోని కథ క్లుప్తంగా ఈ విధంగా ఉంటుంది.

సీత అగ్నిలో ప్రవేశించిన తరువాత, కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వరుణుడు, శంకరుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు విమానలమీద అచటకు విచ్చేసిరి.  వారికి నమస్కరించి నిలచిన శ్రీరామునికి ఇట్లు నివేదించిరి.

"రామా!  నీవు సవలోకముల ఉత్పత్తికి కారకుడవు. సర్వశ్రేష్ఠుడవు.  జ్ఞానులలో అగ్రేసరుడవు.  సీతాదేవి అగ్నిప్రవేశము చేయుచుండగా ఎట్లు ఉపేక్షించుచుంటివి?

అప్పుడు శ్రీరాముడు "నేనెవరిని" అని అడుగుతాడు.

అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు. "రామా! నీవు జగత్కారణుడవైన నారాయణుడవు.  నీ ఉచ్చ్వాసనిశ్శ్వాసములే వేదములు.  సీతాదేవియే లక్ష్మీదేవి.  నీవు శ్రీమహావిష్ణుడవు."

అప్పుడు అగ్నిదేవుడు తండ్రివలె సీతాదేవిని అగ్నిగుండము నుండి తీసుకుని వస్తాడు.  సీతయందు ఎటువంటి దోషము లేదని చెబుతాడు.

---------

ఇక్కడ గమనించవలసిన విషయాలివి:


  • శ్రీమద్రామాయణం వ్రాసేనాటికి బ్రహ్మయే లోకాథిపతి.  వరాలిచ్చినా, విశ్వామిత్రుని వంటివారిని బ్రహ్మర్షిగా   ఆశీర్వదించినా ఆయనే చేసేవాడు.  ఆ తరువాతి స్థానం ఇంద్రుడిది.  ఆయన తరువాతి స్థానం మాత్రమే విష్ణువుది.
  • మూర్తీభవించిన ధర్మమూర్తియైన శ్రీరాముని విష్ణువవతారంగా కీర్తించి, వైష్ణవమతాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టే ప్రయత్నమిది.  ఐతే ఈ ప్రయత్నం చేసినవారెవరైనా వారు ఒక విషయం మఱచిపోయారు.
  • సీతను అనుమానించి పరిత్యజించినట్లు చూపించడంవల్ల, శ్రీరాముని వ్యక్తిత్వం దిగజారిపోలేదా?  అన్యమతస్తులకి శ్రీరాముడు "పురుషాంకారి" అని హైందవ ధర్మాన్ని కించపరిచే అవకాశం దక్కలేదా?

1 comment: