Thursday, 10 August 2023

వాల్మీకి రామాయణం - గాయత్రి రామాయణము

 


గాయత్రి రామాయణము

  1. ·  వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి
  2. ·  గాయత్రీ మంత్రం రామాయణ ఇతిహాసం యొక్క సారాంశం అని,  
  3. ·       రామాయణం వేదాల సారాంశం అని, మరియు
  4. ·       శ్రీరాముడు నారాయణుడు

అని సూచిస్తుంది.  

 

పై 4 అంశాలు విశ్లేషించవలసి ఉంది.

------

గాయత్రీ మంత్రంగా ప్రాచుర్యంలో ఉన్నది విశ్వామిత్ర ఋషి లోకానికి అందించిన సావిత్రీ మంత్రం (దేవత - సవితృ) ఋగ్వేదంలో ఒక ఋక్కుగా (3.62.10)  ప్రస్తావించబడింది.  ఋక్కు గాయత్రీ ఛందస్సులో ఉండడంవల్ల, కాలక్రమంలో సావిత్రీ మంత్రం, గాయత్రీ మంత్రంగా పిలవబడుతోంది.

తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||

-----

1)     వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు

వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయనే వాదనకు ఆధారం బాలకాండ 4 సర్గలోని 2వ శ్లోకము.

చతుర్వింశత్సహస్త్రాణి శ్లోకానాముక్తవానృషిః |

తథా సర్గశతాన్ పఞ్చ షట్ కాణ్డాని తథోత్తరమ్ ||

శ్లోకానికి రెండు రకాల అనువాదాలు గమనించాను.  చివరిలో వచ్చే "తథోత్తరమ్" అనే పదం రెండు రకాల అనువాదాలకు కారణం.  "తథోత్తరమ్" అనే పదానికి ఉత్తరకాండ అని ఒక అనువాదం ఉంది.

అనువాదం ఏదైనా, ఐదు వందల సర్గలు, ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామాయణం రచించబడినట్లు అర్థం చేసుకోవచ్చును ఎన్ని కాండలు రామాయణంలో ఉన్నాయి అనేది, అనువాదం బట్టి మారుతుంది.

అనువాదాలు

వాల్మీకి మహర్షి రామాయణాన్ని ముగింపు భాగంతో కలిపి ఇరవై నాలుగు వేల శ్లోకాలలో, ఐదు వందల సర్గలలో, ఆరు కాండలలో  రచించాడు.

(లేదా)

వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఏడు కాండలలో (ఉత్తరకాండతో కలిపి ఐదు వందల సర్గలతో కూడినది) రచించాడు.

-----

19 శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ముద్రణను ప్రవేశపెట్టేవరకు, రామాయణం దేశంలోని అన్ని ప్రాంతాలలో పదేపదే చేతితో నకలు చేయబడింది.   ప్రస్తుతం మొత్తంగా లేదా పాక్షికంగా రెండు వేలకు పైగా రామాయణ కావ్యం యొక్క వ్రాతప్రతులున్నట్లుగా తెలిసినది.

మరొక పురాతన ఇతిహాసం అయిన మహాభారతం వలె, భారతదేశంలో రామాయణం  ఉత్తర భారతదేశ ప్రతి  మరియు దక్షిణ భారతదేశ ప్రతి అనే రెండు ప్రధాన రూపాలలో లభిస్తోంది. రెండు ప్రధాన ప్రతులు వివిధ ప్రాంతీయ లిపిలలో వ్రాయబడిన వైవిధ్య రూపాలను కలిగి ఉంటాయి.

ఉత్తర భారతదేశ వ్రాతప్రతులు  గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్, నేపాల్, బీహార్ మరియు బెంగాల్ నుండి వచ్చాయి. దక్షిణ భారతదేశ వ్రాతప్రతులు కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు చెందినవి.

అందువలన ప్రస్తుతం లభ్యమౌతున్న వాల్మీకి రామాయణ వ్రాతప్రతులలో శ్లోక సంఖ్య కూడ ఒక తీరుగా ఉండడం లేదు. విశేషబేధం గోచరిస్తున్నది.

------

అందుబాటులో ఉన్న రామాయణంలో కాండలు, సర్గల విభజన  ఇలా ఉంటుంది.

బాలకాండ : 77 సర్గలు

అయోధ్యకాండ : 119 సర్గలు

అరణ్యకాండ  :  75 సర్గలు

కిష్కిందకాండ  : 67 సర్గలు

సుందరకాండ  : 68 సర్గలు

యుద్ధకాండ  : 128  సర్గలు

ఉత్తరకాండ  : 111 సర్గలు

 

ఉత్తరకాండతో (3,538 శ్లోకాలు)  కలిపి రామాయణం పరిశీలిస్తే, అందులో  ఏడు కాండలు, 645 సర్గలు మరియు 24,253 శ్లోకాలు  గమనించవచ్చును.

(లేదా)

ఉత్తరకాండ లేకుండా లెఖ్ఖవేస్తే ఆరు కాండలు, 534 సర్గలు మరియు 20,715 శ్లోకాలు  ఉంటాయి.

 

పై లెఖ్ఖలు ఏరకంగా చూసినా,  బాలకాండ 4 సర్గ 2 శ్లోకములో చెప్పిన 500 సర్గలు మరియు 24,000 శ్లోకాలతో పొసగవు.

బాలకాండ 4వ సర్గలోని 2వ శ్లోకము ప్రక్షిప్తమై ఉండాలి.

-------

2)    గాయత్రీ మంత్రం రామాయణ ఇతిహాసం యొక్క సారాంశం

ప్రాచుర్యంలో ఉన్న గాయత్రి రామాయణములో రామాయణము, గాయత్రీ మంత్రాల గురించి ఆలోచనలు ఇలా ఉన్నాయి.

వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలోని ప్రతి 1,000 శ్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం గాయత్రీ మంత్రాన్ని రూపొందిస్తుంది.  

 శ్లోకాల సంఖ్యను బట్టి గాయత్రి రామాయణము ఇలా ఉంటుంది.

1.

తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం .

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ..

బాలకాండ 1.1

2.

హత్వా రాక్షసాన్సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః .

ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయీ పురా

బాలకాండ 30.23

 

3.

విశ్వామిత్రః సరామస్తు శ్రుత్వా జనకభాషితం .

వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్

బాలకాండ.67.12

4.

తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య విశాంపతేః .

శయనీయం నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత ..

అయోధ్యాకాండ 15.20

5.

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని .

భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ ..

అయోధ్యాకాండ 40.15

6.

రాజా సత్యం ధర్మశ్చ రాజా కులవతాం కులం .

రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం ..

అయోధ్యాకాండ 67.34

7.

నిరీక్ష్య ముహూర్తం తు దదర్శ భరతో గురుం .

   ఉటజే రామమాసీనం జటామండలధారిణం

అయోధ్యాకాండ 99.25

8.

యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం.

   అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహా మతే

అరణ్యకాండ 11.44

9.

భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ ప్రభో.

   మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి 

అరణ్యకాండ 43.17

10.

గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం.

    వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ

అరణ్యకాండ 72.17

11.

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే.

    సుఖదుఃఖసహః కాలే  సుగ్రీవవశగో భవ

కిష్కింధాకాండ 22.20

12.

వందితవ్యాస్తతః సిద్ధాస్తపసా వీతకల్మషాః .

ప్రష్టవ్యా చాపి సీతాయాః ప్రవృత్తిర్వినయాన్వితైః

కిష్కింధాకాండ 43.34

13.

నిర్జిత్య పురీం లంకాం శ్రేష్ఠాం తాం కామరూపిణీం .

విక్రమేణ మహాతేజా హనూమాన్ కపిసత్తమః ..

సుందరకాండ 4.1

14.

ధన్యా దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః .

మమ పశ్యంతి యే వీరం రామం రాజీవలోచనం

సుందరకాండ 26.41

15.

మంగలాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః .

ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనం ..

సుందరకాండ 53.26

16.

హితం మహార్థం మృదు హేతుసంహితం వ్యతీతకాలాయతి సంప్రతిక్షమం

నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్

యుద్ధకాండ 10.27

17.

ధర్మాత్మా రక్షసశ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః .

లంకైశ్వర్యమిదం శ్రీమాన్శ్రువం ప్రాప్నోత్యకంటకం ..

యుద్ధకాండ 41.68

18.

యో వజ్రపాతాశనిసన్నిపాతాన్న చుక్షుభే నాపి చచాల రాజా .

రామబాణాభిహతో భృశార్తశ్చచాల చాపం ముమోచ వీరః ..

యుద్ధకాండ 59.140

19.

యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః .

తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం ..

యుద్ధకాండ 72.11

20.

తే దదృశిరే రామం దహంతమపివాహినీం .

మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా ..

యుద్ధకాండ 94.26

21.

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ .

బద్ధాంజలిపుటా చేదమువాచాగ్నిసమీపతః ..

యుద్ధకాండ 119.23

22.

చలనాత్పర్వతస్యైవ గణా దేవాశ్చ కంపితాః .

చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం ..

ఉత్తరకాండ 16.26

23.

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభోజనం .

సర్వమేవావిభక్తం నౌ భవిష్యతి హరీశ్వర ..

ఉత్తరకాండ 34.41

24.

యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ .

తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం

ఉత్తరకాండ 66.1

 

-------

గాయత్రీ ఛందస్సులో కూర్చిన ఋక్కులో అక్షరాలు 24 (8+8+8) ఉంటాయి. 24 కంటే తక్కువ అక్షరాలు ఉండి, గాయత్రీ ఛందస్సులో కూర్చిన ఋక్కులను నిచృద్గాత్రిలో కూర్చారు అంటారు.

గాయత్రీ మంత్రంగా ఖ్యాతి పొందిన, విశ్వామిత్ర ఋషి కూర్చిన ఋగ్వేద సావిత్రీ మంత్రము (3.62.10), నిచృద్గాయత్రీ ఛందస్సులో కూర్చారు.  ఋక్కులో అక్షరాలు 23 మాత్రమే (7+8+8) ఉంటాయి.

తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియోయోనఃప్రచోదయాత్ ||

కాబట్టి, 23 అక్షరాలుగల నిచృద్గాయత్రీ ఛందస్సులో ఉన్న సావిత్రీ మంత్రము, 24,000 శ్లోకాలుగల రామాయణ సారాంశం అనే ఆలోచన సరికాదు అనిపిస్తోంది.

----

3)    రామాయణం వేదాల సారాంశం

ఋగ్వేదంలో ఋషులు, ఆధ్యాత్మిక లక్ష్యంగా ఉన్నవారు సత్యమును త్రికరణశుద్ధితో (మనస్సుతో ఆలోచన, వాక్కు మరియు కర్మలు) పాటించాలని, ఫలితంగా వారు పరమ సత్యాన్ని చేరుతారని చెప్పారు.

ఇదే విషయాన్ని, వాల్మీకి మహర్షి త్రికరణశుద్ధితో శ్రీరాముడు సత్యపాలన చేయడమనే విషయాన్ని పదే పదే చెప్పారు.

 

ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ శీలవాననసూయకః |

క్షాన్తః సాన్త్వయితా శ్లక్ష్హ్ణః కృతజ్ఞో విజితేన్ద్రియః ||

 

కాబట్టి, రామాయణం వేదాల సారాంశం అనే ఆలోచన మాత్రం సరైనదే!

-----

4)    శ్రీరాముడు నారాయణుడు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రామాయణంలోని (i) పుత్రకామేష్ఠి యజ్ఞ ఘట్టము, (ii) రావణవధ తరువాత వచ్చే సీత పరిత్యాగ ఘట్టము, (iii) ఉత్తరకాండ మొదలైన ప్రక్షిప్తభాగాలను వదలిచేస్తే,  శ్రీరాముని విష్ణువు/నారాయణుని అవతారమని వాల్మీకి మహర్షి ఎక్కడ కూడా చెప్పలేదు.

వాల్మీకి మహర్షి త్రికరణశుద్ధితో శ్రీరాముడు సత్యపాలన చేయడమనే విషయాన్ని పదే పదే చెప్పారు.

ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ శీలవాననసూయకః |

క్షాన్తః సాన్త్వయితా శ్లక్ష్హ్ణః కృతజ్ఞో విజితేన్ద్రియః ||

----

శ్రీరాముడిలో ఉన్న సత్యపాలన చేయడమనే గుణం వల్ల ఆయన భగవంతుని స్థాయికి ఎదిగారు.

-----

లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి మధ్య జరిగిన చివరి యుద్ధంలో, ఇద్దరు యోధులు వారి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతారు.  తమ వద్దనున్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు.  ఐనా  ఇంద్రజిత్తుని జయించడం లక్ష్మణుడికి సాధ్యం కాలేదు.

అప్పుడు లక్ష్మణుడు ఐంద్రాస్త్రం ఎక్కుపెట్టి విధంగా ప్రార్థన చేస్తాడు.

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది ||

పౌరుషే అప్రతిద్వంద్వ: శరైనం జహి రావణిం |

(యుద్ధకాండ 90 సర్గ 71 శ్లోకము)

" బాణమా! దశరథ మహారాజు కుమారుడు, ధర్మనిరతుడు, సత్యసంధుడు ఐన శ్రీరాముడు నిజముగా పరాక్రమమున సాటిలేనివాడే యైనచో ఇంద్రజిత్తును హతమార్చుము"

అస్త్రం ధాటికి ఇంద్రజిత్తు తలతెగి నేలమీద పడుతుంది.

 -----

ఐతే ఇంద్రజిత్తుని చంపినది లక్ష్మణుడి అస్త్రమేయైనా,  అందుకు కారణం మాత్రం, సత్యపాలన చేయడమనే  శ్రీరాముని తపశ్శక్తియే! 

అంతకు ముందు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపడానికి తన వద్దనున్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తాడు, కానీ ఇంద్రజిత్తుని చంపడం సాధ్యం కాలేదు.  చివరకు శ్రీరాముని (i) ధర్మజ్ఞత్వం, (ii) సత్యసంధత, (iii) అజేయత్వం అనే 3 గొప్ప గుణాలు తోడుగాచేసి చేసిన ప్రార్థన వల్లనే ఇంద్రజిత్తు మరణిస్తాడు.

 


No comments:

Post a Comment